(ఏప్రిల్ 13) నయా తెలంగాణ / చౌటుప్పల్ : ధర్మరాజుగా ఉండాలిసిన జానారెడ్డి దృతారాష్ట్రుడిగా వ్యవహారిస్తున్నాడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణస్వీకారోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తాను ఏ రోజు మంత్రి పదవి కోసం ఆడుక్కులేదని, కెపాసిటీని గుర్తించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. తనకు మంత్రి పదవి వస్తుందంటే కొంతమందికి చెమటలు పడుతున్నాయని, ధర్మరాజుగా వ్యవహారించాలిసిన జానారెడ్డి దృతారాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జానారెడ్డి 25-30 ఏళ్లు మంత్రిగా చేసినప్పుడు గుర్తుకురాని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఇప్పుడెందుకు గుర్తుకువస్తుందని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి జిల్లాకు మంత్రి ఇంచార్జిలుగా వ్యవహారిస్తే భువనగిరికి మాత్రం ఎమ్మెల్యేగా ఉన్న తనను ఇంచార్జి బాధ్యతలు అప్పగించారని, పార్లమెంట్ స్థానం గెలిపించుకున్నామని గుర్తు చేశారు. అధిష్టానానికి తన సమర్ధత తెలుసునని, అందుకే ఇంచార్జి బాధ్యతలు అప్పగించిందని అన్నారు. అదిష్టానం మంత్రి పదవి ఇస్తే దానిని బాధ్యత గా భావిస్తానని, యాదాద్రి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మునుగోడు నియోజకవర్గానికి మంత్రి పదవి లేక వెనుకబడిందని, తనకు మంత్రి పదవి వస్తే రాష్ట్రంలోనే మునుగోడు నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *