నయా తెలంగాణ / చౌటుప్పల్ :
అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (టఫ్) రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన చైతన్య యాత్ర ఆదివారం చౌటుప్పల్ కు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రూపొందించిన విధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, రూ. 25 వేల పెన్షన్ అందజేయాలనీ డిమాండ్ చేశారు. గత తెరాస ప్రభుత్వం ఉద్యమకారులను మోసం చేసిందని, వారికి ఉద్యమకారులు, ప్రజలు తగిన బుద్ది చెప్పారని, కాంగ్రెస్ పార్టీ కూడ ఇచ్చిన హామీలను విస్మరిస్తే తెరాస కు పట్టిన గతి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజయ్య, ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు శీలం స్వామి, నాయకులు ఎదురుకట్ల యాదగిరి, కానుగు వెంకటయ్య, ఖలీల్, కానుగు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
